కాపు రిజర్వేషన్లపై వేసిన కమిషన్ చైర్మన్ మంజునాథ రిపోర్టు ఇవ్వకముందే చంద్రబాబు హడావుడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ కేంద్రానికి తీర్మానం పంపారు.
అలా చేయడం వల్ల కాపు రిజర్వేషన్ల అంశం కోర్టులో నిలిచే అవకాశమే లేదని మేధావులు, కాపులు వాదించారు. కానీ చంద్రబాబు మాత్రం వినలేదు. ఇప్పుడు అనుకున్నంత అవుతోంది.
కాపు రిజర్వేషన్లపై కేంద్ర సిబ్బంది శిక్షణా వ్యవహారాల శాఖ అభ్యంతరం తెలిపింది. కాపు రిజర్వేషన్ల అంశంపై కేంద్ర హోంశాఖ… కేంద్ర సిబ్బంది శిక్షణా వ్యవహారాల శాఖ(డీవోపీటీ) అభిప్రాయాన్ని కోరగా.. కాపుల రిజర్వేషన్కు సరైన ప్రతిపాదన లేదని డీవోపీటీ అభిప్రాయపడింది.
రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే అసాధారణ పరిస్థితులు, బలమైన ప్రతిపాదన ఉండాలని డీవోపీటీ అభిప్రాయపడింది.
కానీ కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో అలాంటి పరిస్థితులు, ప్రతిపాదన లేదని డీవోపీటీ అభ్యంతరం తెలిపింది. కమిషన్ చైర్మన్ మంజునాథ్ నుంచి నివేదిక తీసుకోకుండా హడావుడిగా చంద్రబాబు తీర్మానం చేసి కేంద్రానికి పంపడం వల్లే నేడు రిజర్వేషన్లకు సరైన ప్రతిపాదన లేదని డీవోపీటీ అభ్యంతం చెప్పినట్టు భావిస్తున్నారు.